telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 7:18 am Posted by : TELANGANA KERATAM

మండుటెండలోనూ వైభవంగా మాకుల పారువేట

తెలంగాణ కెరటం మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 

మండుటెండలను సైతం లెక్కచేయకుండా భక్తి ప్రవాహంగా మారిన పారువేట ఉత్సవం మరోసారి మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం మహిమాన్వితాన్ని చాటిచెప్పింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం నిర్వహించిన ఈ ఉత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహం, సంప్రదాయ వైభవం, ప్రజా భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం ఆలయ ప్రాంగణాన్ని కిక్కిరిసేలా చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభ బండ్లు, వాహనాలపై కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. మండుతున్న ఎండలోనూ భక్తుల ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గకపోవడం ఈ క్షేత్రంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా కనిపించింది.ఈసారి ఉత్సవానికి యువత పెద్ద సంఖ్యలో హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ వేషధారణలతో, భక్తి నినాదాలతో యువత పాల్గొనడం ఉత్సవానికి కొత్త ఊపును తీసుకొచ్చింది. ఆలయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం తరతరాలకు అందుతున్నదనే భావనకు ఇది బలమైన సంకేతంగా మారింది. రాజకీయ, అధికార, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొని ఉత్సవానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చారు.జాతర విజయవంతానికి పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసింది. కృష్ణ కిషోర్, పవన్ కుమార్ల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బందోబస్తు చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి భక్తుల రాకపోకల వరకూ ప్రతి అంశంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రశంసనీయమైంది.ఇలాంటి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కావు. అవి ఒక ప్రాంత చరిత్రను, సంస్కృతిని, ప్రజల ఐక్యతను ప్రతిబింబించే సామూహిక వేడుకలు. అందుకే మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరింత ప్రాధాన్యంతో తీసుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.పారువేట ఉత్సవం మరోసారి ఒక నిజాన్ని స్పష్టం చేసింది విశ్వాసం ముందు ఎండలూ, కష్టాలూ, దూరాలూ చిన్నవే. స్వామివారి కటాక్షం కోసం తరలివచ్చిన భక్తజనం ఆ విశ్వాసానికి సజీవ సాక్ష్యంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పోలీసులు ప్రజలు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు